ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలో ఏరోసిటీలోని విలాసవంతమైన పుల్మన్ హోటల్లో ఝాన్సీ రాణి శామ్యూల్ అనే ఏపీకి చెందిన మహిళ బస చేసింది. అక్కడ హోటల్ స్పా ఫెసిల
ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలో ఏరోసిటీలోని విలాసవంతమైన పుల్మన్ హోటల్లో ఝాన్సీ రాణి శామ్యూల్ అనే ఏపీకి చెందిన మహిళ బస చేసింది. అక్కడ హోటల్ స్పా ఫెసిలిటీలో ఆమె రూ. 2,11,708 విలువైన సేవలను పొందినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. హోటల్లో 15 రోజుల పాటు బస చేసిన ఆమె మొత్తం రూ.5,88,176 మోసపూరిత లావాదేవీలు చేసింది.
చివరకు 15 రోజుల తర్వాత హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ మహిళను పట్టుకున్నప్పుడు ఆమె ఖాతాలో కేవలం రూ. 41 మాత్రమే ఉందని మంగళవారం పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ విమానాశ్రయం సమీపంలో ఉండడం వెనుక గల కారణాలను ఇప్పటివరకు నిర్ధారించలేమని వారు చెప్పారు. సీనియర్ పోలీసు అధికారి ప్రకారం, ఢిల్లీ పోలీసులు ఆమె అసలు చిరునామా , ఆమె కుటుంబ సభ్యుల వివరాలకోసం ఏపీ పోలీసులను సంప్రదించారు.
“మహిళను మా నిపుణులు విచారించారు. కౌన్సెలింగ్ చేసారు కానీ ఆమె మాకు సహకరించలేదు. ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను చూపించమని మేము ఆమెను అడిగాము, కానీ ఆమె చూపించలేదు. ”అని మరొక అధికారి తెలిపారు.
పోలీసులు ఆమె బ్యాక్ అకౌంట్ను తనిఖీ చేయగా, అందులో కేవలం రూ.41 మాత్రమే ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు.
హోటల్ స్పా ఫెసిలిటీలో ఆమె ఇషా డేవ్ అనే నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసి రూ. 2,11,708 విలువైన సేవలను పొందినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు.
ఐసిఐసిఐ బ్యాంక్ యుపిఐ యాప్లో తాను లావాదేవీలు జరుపుతున్నట్లు ఝాన్సీ రాణి హోటల్ సిబ్బందికి చూపించారని, అయితే బ్యాంకుకు ఎలాంటి చెల్లింపులు అందలేదని తేలిందని పోలీసులు తెలిపారు. “ఆమె ఉపయోగించిన యాప్ సందేహాస్పదంగా ఉందని అనుమానిస్తున్నారు” అని అధికారి తెలిపారు.
నిందితురాలు విచారణకు సహకరించడం లేదని అధికారి తెలిపారు. తాను వైద్యురాలని, తన భర్త కూడా వైద్యుడని, న్యూయార్క్లో నివసిస్తున్నానని ఆమె పోలీసులకు చెప్పారు. అయితే ఈ సమాచారం ఇంకా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు అన్నారు.
ఆమెను మొదట మోసం చేసినందుకు అరెస్టు చేశారు, అయితే తరువాత IPC సెక్షన్లు 419 (వంచించడం ద్వారా మోసం చేసినందుకు శిక్ష), 468 (మోసం చేయడం కోసం ఫోర్జరీ చేయడం) , 471 ( నకిలీ పత్రాలుగా ఉపయోగించడం) ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు అధికారి తెలిపారు.