HomeTelangana

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీ సమావేశాలకు వనమా వస్తారా?

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీ సమావేశాలకు వనమా వస్తారా?

ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. ఈ విషయంలో కేసీఆర్ కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది.

తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన‌ – ఆగిన‌ బస్సులు
115 మంది తో బీఆరెస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన కేసీఆర్…రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటీ
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం బిల్లు ఆమోదించిన అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వర్షాకాల సమావేశాలను ఈ నెల 3 నుంచి నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలకు మరో మూడు నెలలో సమయం ఉన్నది. శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో.. ఇవే చివరి సమావేశాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంతో హైకోర్టు అతనిపై అనర్హత వేటు వేసింది. డిసెంబర్ 2018 నుంచి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా కోరినా.. హైకోర్టు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఎవరు కొత్తగూడెం ఎమ్మెల్యే అనే విషయంపై సందిగ్దత నెలకొన్నది.

వనమా వెంకటేశ్వరావును హైకోర్టు అనర్హుడిగా ప్రకటించినా.. అసెంబ్లీ కార్యదర్శి మాత్రం ఇంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. అదే సమయంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలంటూ జలగం వెంకట్రావు ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వద్దకు వెళ్లి అవసరమైన పత్రాలు ఇచ్చారు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

కాగా, ఎలక్షన్ కమిషన్ నుంచి స్పీకర్‌కు సవరణ డ్రాఫ్ట్ కాపీ రానందునే ఇంకా వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించలేదని తెలుస్తున్నది. రేపటి నుంచే సమావేశాలు ప్రారంభం అవుతుండగా.. జలగం పరిస్థితి ఏంటనే విషయం మాత్రం తేలడం లేదు. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. ఈ విషయంలో కేసీఆర్ కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది. రాబోయే ఎన్నికల్లో వనమాను పక్కన పెట్టి వెంకట్రావుకే టికెట్ ఇస్తే సరిపోతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, రాహుల్ గాంధీ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటలు గడవక ముందే లోక్‌సభ కార్యదర్శి అనర్హత నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం.. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కావడంతోనే గంటల వ్యవధిలో చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగూడెం పరిస్థితి అధికార పార్టీకి కాస్త ఇబ్బందిగా ఉన్నది. వాస్తవానికి ఈ తీర్పు బీఆర్ఎస్‌కు అనుకూలంగా వచ్చిందనే భావించవచ్చు. కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడని హైకోర్టు ప్రకటించింది.

కానీ, కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు. గెలిచిన కొన్నాళ్లకే ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు వెంకట్రావు కూడా బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నట్లు చర్చ జరుగుతోంది.