కొడుకుపై పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన వైనం గణపురం పోలీస్స్టేషన్లో ఘటన జయశంకర్ భూపాలపల్లి బ్యూరో
- కొడుకుపై పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
- స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన వైనం
- గణపురం పోలీస్స్టేషన్లో ఘటన
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (నినాదం):
కన్నకొడుకుపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కొడుకును విచారణకు స్టేషన్కు పిలిపించడంతో అవమానం తట్టుకోలేక పోలీసుల ఎదుటే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం పోలీస్స్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…గణపురం మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన మోటపోతుల రాజు అనే వ్యక్తి కొందరి వద్ద అప్పు చేశాడు. తిరిగి అప్పు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు రాజు తల్లిదండ్రులపై అప్పు తీర్చమని ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయంపై తల్లిదండ్రులు కొడుకును మందలించడంతో రాజు వారిపై దాడి చేశాడు. దీంతో తమ కొడుకు రాజు తమపై దాడి చేసి కొట్టాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు రాజును విచారణ నిమిత్తం బుధవారం స్టేషన్కు పిలిపించారు. తనను పోలీస్స్టేషన్కు పిలిచారనే అవమానం తట్టుకోలేక రాజు స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో షాకైన పోలీసులు అతడిని వెంటనే 108 వాహనంలో ములుగు సివిల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.