HomeTelangana

గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్ – ఐపీఎస్ సజ్జన్నార్

గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్ – ఐపీఎస్ సజ్జన్నార్

అనారోగ్యంతో మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ గురించి ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ట్వీట్ చేశారు. ''కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ

గద్దర్ కన్నుమూత‌
నాభర్తను పెట్రోల్ పోసి పోలీసులే తగలబెట్టారు.. హోంగార్డు భార్య సంచలన ఆరోపణ‌
గద్దర్ మృతికి ప్రముఖుల సంతాపం

అనారోగ్యంతో మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ గురించి ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ట్వీట్ చేశారు.

”కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి!

గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న.

పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని మెదడులో ఆలోచనలు రేపేది అని పరమార్థాన్ని చెప్పేది.. పాటంటే మాటలతో తూటాలను ఎక్కుబెట్టి.. అన్యాయపు మర్మాన్ని రట్టు చేసేది అని అర్ధం అని చెప్పిన వారు గద్దర్.

ఎన్నో ప్రజా పోరాటాలను ముందుండి నడిపించి, అన్ని పక్షాల ప్రజలను కలుపుకుని సమ సమాజ నిర్మాణానికి అలుపెరగని పోరాటం చేసి, మృత్యువుతో పోరాడి ఓడినా.. ప్రజల నాలుకలపై పాటవై చిరంజీవిగా నిలిచిన గద్దర్ గారికి TSRTC యాజమాన్యం పక్షాన మరియు TSRTC ఉద్యోగుల పక్షాన నివాళులు అర్పిస్తున్నాం.

గద్దర్ గారితో నాకు సుమారు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. ప్రజా ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ఎన్నో సందర్భాలలో నాతో పాలు పంచుకున్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు చెప్పేవారు.

ఒకానొక సందర్భంలో తను రాసిన పాట “మల్లె తీగకు పందిరి వోలె… మసక చీకటిలా వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తొడ బుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా” అనే పాటకు ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించినా తను దానిని తిరస్కరించినట్లు చెప్పి పాట పై తనకున్న గౌరవాన్ని చాటి, పాటంటే వ్యాపారం కాదని, పాటంటే ప్రజల నాడి అని చెప్పారు.

గద్దర్ గారు ఎన్నో సందర్భాలలో నన్ను కలిసి ఆయన మీద నమోదైన కేసుల గురించి చర్చించేవారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఎంత పెద్ద అధికారి అయినా రాజకీయ నాయకులనైనా, వయసులో తనకంటే చిన్న వారిని కూడా నోరార “అన్నా” అని పిలిచేవారు. ఆసువుగా పాట పాడటంలో గద్దర్ గారిని మించిన కవి, గాయకుడు లేరని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు. ఈ మధ్య కాలంలో గద్దర్ గారి ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేక పోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటారు. ఉద్యమ కారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం.

గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.”